భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత పదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కఠోర శ్రమతో రూపొందించిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది.
జూలై 15న (సోమవారం) తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్ఎల్వీ -3 ఎం-1 రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. జూలై 14న (ఆదివారం) ఉదయం 6.51 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభించారు.
ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే 1.55 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. రాకెట్లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్కు సంబంధించిన బ్యాటరీలు చార్జ్ కాకపోవడంతో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు క్రయోజనిక్లో ఉన్నటు వంటి గ్యాస్ బాటిల్ లీకేజీ రావడం మరో కారణంగా గుర్తించారు. దీంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేశారు.
చంద్రయాన్-2
చంద్రయాన్-2 మొత్తం బరువు 3.8 టన్నులని, ఇస్రో ప్రయోగిస్తున్న లాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదని శివన్ వెల్లడించారు.
రోవర్ సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు.
ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.1,000 కోట్లుకాగా, చంద్రయాన్ -2 కోసం రూ. 603 కోట్లు ఖర్చుకానుంది.
ఇందులో జీఎస్ఎల్వీ ఎంకే-3 కోసం రూ.375 కోట్లు వెచ్చించనున్నారు.